2, జనవరి 2012, సోమవారం

చలిమంట

పొద్దున్నే లేచి చలికి తట్టుకోలేక చేతులు రాపాడిస్తూ ఆ వేడిని చెంపలకి అద్దుకుని, నోట్లో బ్రష్ వేసుకుని నాన్న కొత్తగా కొనిచ్చిన రబ్బరు చెప్పులు తొడుక్కుని చలికి వణుకుతూ నడుస్తూ మురళి గాడి దగ్గరికి వెళ్తే అప్పటికి వాడు ఇంకా లేవలేదు.వాడిని లేపి అరే పదరా చలిమంట వేసుకుందాము అని చెప్పి కోళ్ళ గంప తీసి చూసే సరికే మేము తెచ్చిపెట్టుకున్న సరంజామా ఏమీ లేదు అక్కడ.

*****************************************************************

అది మామూలు చలిమంట కాదు,మేము ఎంతో కష్టపడి మా వీధిలోకే పెద్ద చలిమంట వేయాలని అనుకున్నాము.
అసలు చలిమంట వేయడమంటే మామూలు విషయం కాదు.ఎన్నెన్ని కావాలని.ముందు రోజు రాత్రి నేను, మురళి గాడూ వీధులన్నీ వెతికి ఎండిపోయిన పుల్లలు,తాటి మట్టలూ,నర్సరీ కి వెళ్ళి అక్కడ ఉన్న ఎండిన వెదురు బొంగులూ,విజ్జమ్మ బడ్డీ కొట్టు దగ్గరా,విజయ్ కొట్టు దగ్గరా కొబ్బరికాయలు అమ్మినపుడు తీసిన పీచు ఇవన్నీ దొరతనంగానే సంపాదించినా దొంగతనం గా సంపాదించల్సినవి అతిముఖ్యమైనవీ ఇంకొన్ని ఉన్నాయి.అవి ఎండు గడ్డి, పిడకలు.ఆ రోజు ఎంత ప్రయత్నించినా ఎండుగడ్డి దొంగిలించలేక పోయాము.ఇంటి పక్కనే గడ్డివాములు ఉన్నాయి కానీ తీసుకొస్తే యశోద ఆంటీ చూడగానే గుర్తుపట్టేస్తుంది.భాస్కర్ అన్నకి(మా కంటే రెండెళ్ళు పెద్ద అంతే) కూడా మాకు ఇవ్వాలనే ఉన్నా ఇవ్వలేడు పాపం తనని కూడా కొడుతుందని భయం.ఇక మిగిలిన పిడకలైనా ఎలాగోలా సంపాదించాలి కదా.మా వీధిలో ఎవరూ పిడకలు చేయరు.ఉన్న పేడ అంతా వాళ్ళు కళ్ళాపి చళ్ళుకోడమో,పక్కింటి వాళ్ళకి కళ్ళపి చళ్ళుకోడానికి ఇవ్వడమో చేస్తారు.మరి ఎలా?పిడకలు కావాలంటే మూడు వీధుల అవతల ఉన్న లింగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి.కానీ లింగా భార్య లచ్చిం పిడకలు చేసి అమ్ముతుంది.ఊరికనే ఇవ్వదు అందుకనే దొంగతనం.


గడ్డి ఎలాగో సంపదించలేక పోయాము కదా, ఇక ఖచ్చింతంగా ఎలాగైనా పిడకలు సంపాదించాలి.ఎలాగూ లింగా పాలు పొయడానికి మా ఇంటికి వస్తాడు.ఆ సమయంలో అక్కడికి వెళ్ళి లచ్చిం బర్రెలకి కుడితి పెట్టడానికి ఇంటి వెనక్కి వెళ్ళినపుడు టకా టకా ఒక నాలుగు పెద్ద పిడకలు పీక్కు వచ్చేయడమే.చాలా సుళువు.పధకం ప్రకారం ఆ రోజు సాయంత్రం లింగా వాళ్ళ వీధి దగ్గరే ఆడుకుంటున్నాము.కాసేపు కాగానే లింగా పాల లోటా తీసుకుని బయలుజేరాడు.మేము మెల్లగా మా గోళీల గుండం లింగా వాళ్ళ ఇంటి ఎదురుగా గీసి మళ్ళీ ఆట అక్కడ మొదలు పెట్టాము.లచ్చిం ఎపుడు ఇంటి వెనక్కి పోతుందా అని ఎదురుచూస్తున్నాము.మురళి గాడు చెప్పాడు "శివయ్యా నేను ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటాను నువు వెళ్ళి పిడకలు పీక్కు వచ్చేయి" అని.నేను అలాగే అన్నాను.అవకాశం కోసం చూస్తున్నాము.

కాసేపటి తరువాత లచ్చిం ఇంటి వెనక్కి వెళ్ళింది.ఇక నేను ముందూ వెనక చూడకుండా ఉరుకుతూ వెళ్ళి చేతికి అందిన నాలుగు పిడకలు పీక్కుని వచ్చేసాను.ఇద్దరం ఇక ఆగకుండా పరిగెత్తితే ఇక ఆగింది ఇంటి దగ్గరే.ఎలాగోలా కావల్సినవి సంపాదించాం కాబట్టి అవి రాత్రి మళ్ళీ మంచు పడి తడవకుండా ఒక సిమెంట్ బస్తాలో వేసి మురళి వాళ్ళ కోళ్ళ బుట్టకింద దాచి ఆ రాత్రి వెళ్ళి పడుకున్నాము.

ఇపుడు పొద్దున్న చూసేసరికి ఏమీ లేవు. అంత కష్టపడి సంపాదించిన పీచు,తాటి మట్టలు, ఎంతొ కష్టపడి దొంగిలించిన పిడకలు అన్నీ మాయం. అటు, ఇటు వెతకడం మొదలు పెట్టాం.ఎక్కడా లేవు.నాకు మురళి మీద కోపం వచ్చింది.అరే పెట్టింది మీ కోళ్ళ గంప కిందనే,ఎక్కడికి పొతాయిరా అని అడిగాను.వాడు బిక్క మొగం వేసి నిజంగా నాకు తెలీదురా అన్నాడు.ఇక చేసేదేమీ లేక మా ఆశలన్ని ఆవిరి ఐపొయాని ఉసూరు మంటూ వెనక్కి వెళ్తుండగా నరేష్ గాడు ఉరికి వచ్చి చెప్పాడు.అరెయ్ ఆ శేఖరన్న మీ కోళ్ళ గంప కింద ఉన్న మూట తీసుకు వెళ్ళీ ఆ రాముగాడికిచ్చాడు రా అని.మేము పరుగు పరుగున వెళ్ళే సరికి వాళ్ళు మా సామానుతో అప్పటికే చలిమంట వెలిగించేసారు.మాకు పిచ్చి కోపం వచ్చింది. మురళి గాడు పక్కనే ఉన్న నీళ్ళ గాబులొంచి తపేళాతో నీళ్ళు తీసుకుని ఒక్కసారి ఆ మంట మీద గుమ్మరించాడు.అంతే రాముగాడు మురళి మీద కలబడ్డాడు.నేను వెళ్ళి వాడి మీద పడ్డాను.అలా ఒకరిమీద ఒకరు కలబడుతూ ఉన్నది చూసి రాము వాళ్ళ అమ్మ ఇంట్లోంచి పరుగు పరుగున బయటకి వచ్చి అందరి మీదా కేకలేసి రాము గాడిని మా నుంచి విడిపించి ఏమైందని అడిగింది,నేను రొప్పుతూ మేము చలిమంట కోసం తెచ్చుకున్న సామనంతా దొబ్బేసాడు వీడు అని చెప్పాను కసిగా పగిలిన పెదం మీద రక్తం తుడుచుకుంటూ.దానికి శేఖరన్న ఏదో కష్టపడి సంపాదించినట్టు చెపుతారేం? లచ్చిం వాళ్ళ ఇంట్లోంచి ఎత్తుకొచ్చిన పిడకలేగా అవి, నేను చూసాను, లచ్చిం కి కూడా చెప్పాను.అవి నన్ను తీసుకు రమ్మంది, నేనే రాత్రి తీసుకు వెళ్ళి ఇచ్చాను మూట.పిడకలు తీసుకుని మూట నాకు ఇచ్చేసింది అని చెప్పాడు.

ఇక చేసేదేమీ లేక వెనక్కి కాళ్ళీడ్చుకుంటూ తిరిగివస్తుంటే భాస్కర్ అన్న కలిసాడు.అప్పుడే పేపర్ వేసి తిరిగి వస్తున్నాడు.ఏమైందని అడిగాడు జరిగిందంతా చెప్పాము.వీధిమొత్తానికి పెద్ద చలిమంట వేద్దామంటె ఇలా అయింది అన్నా అని ఏడుస్తూ.దానికి అన్న మరేం పర్లేదు నేనున్నాను అని చెప్పి,మనం వాళ్ళ కంటె పెద్ద మంట ఇపుడే వేద్దాం అని చెప్పి మమ్మల్ని ఎంకులు వాళ్ళ కూలిపొయిన తాటాకు పాకకి సైకిలు మీద తీసుకు వెళ్ళి ఇంటి కప్పుకి లోపలి వైపు ఉన్న తాటాకు లు పీకమని చెప్పి ఎటో వెళ్ళి 10 నిముషాలలో ఒక అర బస్తా కొబ్బరి పీచు తెచ్చాడు.అవి వెంకటేశ్వర స్వామి గుడిలోంచి అనుకుంటా తెచ్చింది.పూజారి గారింటికి కూడా భాస్కర్ అన్నే పేపర్ వేసేది మరి.మేము అలా తెచ్చిన తాటాకులు, కొబ్బరి టెంకెలు,పీచు సైకిలు మీద పెట్టుకుని ఇంటికి వెళ్ళాము.భాస్కర్ అన్న వాళ్ళ ఇంటి వెనక దొడ్లోంచి ఒక గడ్డి మోపు కూడా పట్టుకొచ్చాడు.

అన్నీ సిద్ధం, మా చలిమంటకి.అందరినీ పిలిచాము,తాయారు అంకుల్నీ, ఎలిసెమ్మ ఆంటీనీ,దేవకి ఆంటీని,ఇంటర్ చదూతున్న శ్రీధర్ అన్ననీ,గోపాల్ గాడిని, వాళ్ళ నాన్ననీ,మా అమ్మా నాన్ననీ,తాతయ్యనీ అందరినీ పిలిచి వెలిగించాము.చలిమంట. మా వీధిలోకే పెద్ద చలిమంట.దాదాపు అరగంట పైన వెలిగిన మంట.


అంతా అయిపొయిందనుకున్నాము కానీ అవలే, తరువాత పాలు పొయాడానికి వచ్చిన లింగా మా అమ్మకి చెప్పేసాడు మేము పిడకలు దొంగిలించిన సంగతి.యశోదా ఆంటీ కి భాస్కర్ అన్న గడ్డిమోపు తీసిన సంగతి కూడా తెలిసింది.మా ఇద్దరికీ వీపులు వాచాయి.మాకు తోడుగా ఉన్నందుకు మురళి గాడికి కూడా తగుమాత్రంగా పడ్డాయి.ఐతేనేమి మా వీధిలోకే పెద్ద చలిమంట వేసాము.ఆ తరువాత అంత మంట మళ్ళీ మా పిలకాయల గ్యాంగులో ఎవరూ వేయలేదు.

3 కామెంట్‌లు: