24, ఏప్రిల్ 2010, శనివారం

వెన్నెల్లో ఆడపిల్ల-నిద్రలో పీడకల

అవి మేము ఇంకా కోదాడకు రాని రోజులు,అప్పుడు మా వీధిలో మా ఒక్కరి ఇంట్లో మాత్రమే టి.వి ఉండేది.చుట్టుపక్కల అమ్మలక్కలందరూ పనులు అయిపోయాక మా ఇంటికి వచ్చి సీరియల్స్ చూసే వాళ్లు.

అప్పుడు సీరియల్స్ కూడా ఇప్పటి సీరియల్స్ లా జీడిపాకం సీరియల్స్ కాదు.7:30 కి వార్తలు అయిపోయాక వచ్చి 8:30 వరకు టి.వి చూసి వెళ్ళేవారు.8:30 కి ధారావాహిక కార్యక్రమాలు అయిపోయాక తరువాతి రోజు వచ్చే కార్యక్రమాల గురించి చెప్పేవారు.అలా ఒకరోజు అందరూ వెళ్ళిపోతున్న సమయంలో రేపటి నుండి రాత్రి 8:00 గంటలకు వెన్నెల్లో అడపిల్ల ధారావాహిక కార్యక్రమం అని వెసారు,అది చూడగానె నాన్న "అబ్బ!చాలా మంచి సీరియల్" అని అన్నాడు.అంతే అమ్మలక్కందరూ రేపటి నుండి ఆ సీరియల్ చూసితీరుతామని ప్రతిన బూని వెళ్ళారు.

అప్పటికి నేను ఏ రెండో తరగతో చదువుతూ ఉండొచ్చు.అప్పుడు నాకు ప్రేమ కథలు అంతగా నచ్చేవి కాదు.ఆ వయసు వాళ్ళకి ఎవరికీ నచ్చవనుకుంటా.అందుకే నేను అంతగా పట్టించుకోలేదు,నా మట్టుకు నాకు ఆదివారం పూట వచ్చ్చే శ్రీకృష్ణ అంటే చచ్చేంత పిచ్చి.అందులో యుద్ధాలు గట్రా చూడడం అంటే మహ సరదా.

వెన్నెల్లో ఆడపిల్లా ఏ రోజు వచ్చేదో కూడ సరిగా గురుతు లెదు,కాని అది వచ్చె రోజు ఇళ్ళు ఒక జాతర అయేది.కొన్ని రోజులకే చిత్రలహరి లాంటి పాపులర్ కార్యక్రమాన్ని డామినేట్ చేసేసింది.( ఇది నేను ఆ రెండు రోజులూ మా ఇంటికి వచ్చే జనాభాని బట్టి వేసిన చిత్తు లెక్క మాత్రమే ).

నాకు చాలా బోల్డు హాశ్చెర్యం వెసేది ఆ అభిమాన గణాన్ని చూస్తే.అలా అలా గడుస్తూ ఇప్పటి సీరియల్స్ లా కాకుండా ఆ సీరియల్ క్లైమాక్స్ కి వచ్చేసింది.రేపు చివరి భాగం అనగానే ఆ రోజు ఎపిసోడ్ న మిస్ అవకూడదని అందరూ తీర్మానించుకుని తరువాత రోజు టంఛనుగా వచ్చి వాలాయి అభిమాన చకోరాలు.

నాకు కూడా అంత మంది జన సందొహాన్ని చూసే సరికి కుతూహలం కాస్త పెరిగింది.నేను కూడ చూద్దామనికూర్చున్నాను టి.వి ముందు.లీలగా క్లైమాక్స్ గురుతుంది చివరకు గులాబి పూల దండలోంచి హీరోయిన్ చేయిని చూపిస్తారు,ఆ చెతికి ఒక ఉంగరం ఉంటుంది.హీరో ఆ అమ్మాయి శవాన్ని చూడ కుండానే వెనుదిరుగుతాడు.

నాకు అప్పుదు అంత బాగా నచ్చలేదు కానీ,మా ఇంటికి వచ్చిన ప్రేక్షక మహాశయులంతా కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ ఒకరిని ఒకళ్ళు ఓదార్చుకుంటూ ఏదో విధి అనీ,కలికాలం అనీ నొచ్చుకుంటూ బాధా తప్త హృదయాలతో వెళ్ళిపోయారు.

****************************************************************

కట్ చేస్తే

****************************************************************

2006వ సంవత్సరం.నేను మా బాబాయి వాళ్ళ ఇంటికి వెళితే నాకు "విజయానికి అయిదు మెట్లు" పుస్తకం ఇచ్చి చదవమన్నాడు.దానికి పబ్లిషర్ రాసిన ముందు మాటలో ఒక పాయింట్లో అప్పటిలో వెన్నెల్లో ఆడపిల్ల విడుదల అయిన మొదటి రోజే కాపీలన్నీ అమ్ముడయ్యాయి అని రాసాడు.

అప్పుడు మొదటి సారి నాకు ఆ నవల చదవాలని అనిపించింది.ఎలా?ఎక్కడ దొరుకుతుంది?తెలియదు.అసలు తెలూ నవలలు ఇప్పటికీ అమ్ముతునారన్న విషయం కూడా తెలియదు.ఎలగైనా చదవాలని అనుకున్నాను.అలా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నవల చదవకుండానే అయిపోయింది.


రెండో సంవత్సరం ఇంటర్ సెమిష్టర్ హాలిడేస్ కూడా వచ్చాయి కాల క్రమంలో.అలా మళ్ళీ ఒక రోజు మా బాబాయి ఇంట్లో పుస్తకాలదొంతరలో వెతుకుతుంటే అపుడు నా కళ్ళ బడింది ఆ పుస్తకం. చప్పున తీస్కుని బయటపడ్డాను. ఆ రాత్రి ఎలాగైనా పూర్తి చేసేయాలి అని డిసైడ్ అయిపోయాను.


ఆ రోజు రాత్రి

అన్ని పనులూ,అన్నం తినడం వగైరా వగైరా అన్నీ త్వర త్వరగా పూర్తి చేసి 8:00 గంటలకు పుస్తకం పట్టుకుని కొర్చున్నాను.నేను కొన్ని పేజీలు మాత్రమే తిపాను,తరువాతంతా పుస్తకమే నా చెత మిగతా పేజీలన్నీ చదివించింది.అసలు చదువుతున్నంత సేపూ నేను నాలో లేను.ఆ కథ జరుగుతున్న ప్రదేశంలో వాళ్ళ మధ్య ఇరుక్కుపోయాను.

అసలు అలాంటి ఆలోచన ఎలా వచ్చింది యండమూరికి అని హాశ్చెర పడిపోయేను.ఎంత బాగా రాసాడంటే,అసలు అమ్మాయి అంటే
రమ్య మాత్రమే అనిపించేలా ఉంటుంది.ఆ అమ్మాయి తెలివితేటలూ,ఒక చదరంగ గ్రాండ్ మాస్టర్ ని ఒక చిలిపి అమ్మాయి ఆట పట్టించిన విధానం.యండమూరి ప్రతి ఒక్క పాత్రకీ ఒక వ్యక్తిత్వాన్ని సృష్టిస్తాడు.ప్రతో పాత్రా ఆకట్టుకుంటుంది,ముఖ్యంగా జేంస్ పాత్ర.

నవల చివరి 30 పెజీలు చదౌవుతున్నంత సేపు నా చేతి గోర్లన్నీ పళ్ళ దాడికి బలైపోయాయి.ఒక అంతర్జాతీయ స్థాయి ఆటగాడు తను వలచిన అమ్మాయి కోసం ఆట ఓడిపోయినా కోఓడా పర్వాలెదనుకుని,ఒక క్లూ దొరకగానే చిన్న పిల్లాడిలా పరుగు పరుగున వెళ్ళి రమ్య అడ్రస్ కనుక్కోవడం చాలా బాగా రాసాడు.

ఇందులో బాగా ఆకట్టుకునే ఇంకో విషయం రమ్య,రెవంత్ కి రాసే నాలుగు లేఖలు.అందులోనూ చివరి లేఖ కళ్ళ నీళ్ళు తెప్పిస్తుంది.
ఆఖరుకి చాలా హృద్యంగా ముగిస్తాడు.


అప్పుడు అర్థం అయింది నాకు,చిన్నప్పుడు అమ్మలక్కందరూ ఎందుకు ఏడ్చారోఈ.చదివాక నేను ఏడ్చాను.


అసలు ఎంతలా ఫీల్ అయ్యానంటే,రమ్య చనిపోయిన తరువాత రేవంత్ మానసిక పరిస్థితి వివరిస్తూ నేనే ఒక రచన చేయాలన్నంత.

బరువుగా బాధపడి,దాన్నుండి తెరుకుని టైం చూద్దును కదా 3:00 అయింది.


ఇక నిద్రకు ఉపక్రమిద్దామనుకుని మంచం ఎక్కాను.కష్టంగా కలత నిద్రలోకి జారుకునాను.ఆ రాత్రి నిద్ర సరిగా పట్టలేదు.
ఎలాగైనా ఈ నవలని మినిమం నలగురి చేత చదువించాలనుకున్నాను.హాలిడేస్ అయిపోగానే పుస్తకం కాలేజ్ కి తీసుకు వెళ్ళాను.మా ఫ్రెండ్స్ కొంతమందికి ఇచ్చాను చదవమని,చదివాక అందరిది ఒకే మాట "నిద్ర పట్టడం లేదు బాసూ!".

పట్టినా పీడకలలు, ప్రేమించిన అమ్మాయి చనిపోతే అని.

17, ఏప్రిల్ 2010, శనివారం

చిత్రలహరి చిక్కులు తెచ్చిపెట్టిన విధంబెట్టిదనిన......

శ్రీ మద్రమారమణ గోవిందో హా...

భళి భళి భళి భళి అదిగో వచ్చెను క్రిష్ణయ్య,ఆ ఉగ్ర ర్రూపమే చుడవయా...

కుడి చేతిని పైకెత్తి........ఆహో
ఎడమ చేతితో తొడ కొట్టి.....ఆహో

కదనరంగమున కట్టె పట్టుకుని కాలు దువ్వెనే....

శ్రీ మద్రమారమణ గోవిందో హా...

అంతట నారద మునీంద్రుల వారు వచ్చి ప్రలయకాళ రుద్రుని వలె కనిపిస్తున్న క్రిష్ణుల వారితో,

ఎందుకయ్యా క్రిష్ణయ్యా,ఏమి ఆ మహోగ్ర రూపం,ఈ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తావేమిటయ్యా? అని అనెను.

దానికి క్రిష్ణుల వారు వీరు పిచ్చుకలు కాదు నారదా,కీచకులు,వీరు చేసిన నేరము నీవెరుగవనెను.

దానికి నారదుల వారు వారు చేసిన నేరమేమని అడుగగా,క్రిష్ణుల వారు ఈ విధంగా సెలవిచ్చెను.

నారదా నీవెరుగుదువు కదా,ఈ చుట్టుపక్కల నాలుగు వీధుల వరకు మా ఇంటి లో తప్ప మరెక్కడ ద్రుశ్య శ్రవణ పరికరము(టి.వి) లేదు.కావున చుట్టుపక్కల పుర ప్రజలంతా మా గ్రుహమున కార్యక్రమములు వీక్షంచుటకు అలవాటు పడిరి.


దూరదర్శనమున పాడి పంటలుపశువుల పెంపకం కార్యక్రమము చూసిన తరువాత అమ్మలక్కల్లంతా పిల్ల జెల్లకు కూసింత కూడు వండి పెడదామని బయలుదేరారు.


తరువాత వార్తావాహిని కావడంతో ఎవరూ రాలేదు చూడడానికి,ఆ సమయమున మా కుటుంబ సన్నిహితురాలు చాల దూరము నుండి మమ్ముల చూడడానికై తన ద్విచక్ర వాహనము మీద ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వచ్చినది.


పేరుకు పరమాత్మనైనా,పాక ముందు పార్కింగ్ కి ప్లేస్ లేని ఇంట్లో ఉంటున్నాను.అందుకోసం తను మా ఇంటి వెనక ఉన్న రహదారి మీద వాహనము నిలిపి వచ్చినది.

కుశలప్రశ్నలు,పలకరింపులూ అయి మేము ఏదో విషయం గురించి మాట్లాడుతుండగా ఈ వెధవ వచ్చి "క్రిష్ణుల వారూ 7:30 అయింది "చిత్రలహరి" వచ్చు వేళ అయినదని చెప్పెను.




చాలా కాలము తరువాత కలిసిన మా బంధువుతో మాట్లాడుతూ ఉండడం మూలాన నేను వాడిని ఒక పది నిముషముల తరువాత రమ్మని చెప్పినాను.

వాడు సరిగ్గా లెక్క చూసుకుని పది నిముషాల తరువాత వచ్చి మళ్ళి చిత్రలహరి గురించి అడిగెను.

నేను ఈసారి ఒకింత కటువుగా అయిదు నిముషముల తరువాత రమ్మని చెప్పినాను.


వాడు మళ్ళీ మూడు నిముషాలు కాకముందే గోడకు కొట్టిన బంతిలా వచ్చాడు,ఈసారి నేను కాస్త ఘాటుగా పెట్టడం కుదరదని చెప్పాను.వాడు మళ్ళీ తిరిగి రాలేదు.



మా బంధువుతో కబుర్లు అయిపోయాక వారిని సాగనంపడానికి వెళ్ళి చూద్దును కదా వారి ద్విచక్ర వాహనము కాస్తా రూపురేఖలు మారిపోయి,మన దేవేంద్రుని పుష్పకవిమానముని తలపించినది.


దాని ఆకారము వికారముగా ఐనది,వెనుక టైరు వంకర తిరిగిపోయినది,హ్యండిల్ హ్యమర్ పెట్టి కొట్టినట్టు వంద వంకర్లు తిరిగినది,హెడ్ లైట్ మీట నొక్కకుండానే వెలుగులు విరజిమ్ముతున్నది,పెడలు వెయ్యి గజముల ఎడముగా పడి ఉన్నది,సీటు సవా లక్ష చిరుగులు పడినది.



మొత్తముగా వాహనము,తెలుగు సినీ నాయకుడు బాలక్రిష్ణ తన బల ప్రదర్శనతో శత్రు సమూహమును మట్టుపెట్టిన పిమ్మట,వీక్షకుల మదిలో ఆలోచనల మళ్ళే అంతూ,పొంతూ లేకుండ ఉన్నది.


ఇపుడు చెప్పు నారదా?కేవలము చిత్రలహరి కోసము,చిత్తు కింద బండిని బద్దలు కొట్టిన వీడి బుర్ర క్రిష్ణ కీర్తన పాడించవలసిన ఆవశ్యకత ఉన్నదా లేదా?


దానికి నారదుడు మధ్యే మార్గముగా తప్పు వీడిది కాదు,కార్యక్రమముదని యోచించి దూరదర్శనమునకు పోటీగా మరికొన్ని ఛానల్స్ ని ప్రవేశ పెట్టి దానిని నిర్వీర్య పరిచినాడు.


శ్రీ మద్రమారమణ గోవిందో హా...

16, ఏప్రిల్ 2010, శుక్రవారం

మండేనాడు

నేను పదవ తరగతి చదువుకునే రోజుల్లో మాకు మ్యాథ్స్ చెప్పిన సార్ పేరు రమణ కుమార్.ఇప్పటికీ అదే స్కూల్ లో పని చేస్తున్నాడు.

మామూలుగా ఎవరికైనా కోపం వస్తే తిట్టడం కద్దు.అందుకు మా సార్ ఏమి మినహాయింపు కాదు.కాకపోతే ఆ తిట్లు ఒకింత వింతగా ఉంటాయి.ఉదాహరణకి ఎవరైనా క్లాస్ చెపుతుంటే మాత్లాడుతున్నారనుకోండి ఒరేయ్ వెధవ ఒళ్ళు ఏమైనా టిమటిమలాడుతోందా కొడితే కిసుక్కుమంటావ్.

బెంచి కేసి కొట్టాననుకో బాక్సు బద్దలౌద్ది.

కొడితే పల్లు ఊడి కంపాక్సు బాక్సులో పడతై వెధవ.

మొహం మీద గుద్దితే మచ్చుకు పోల్చుకోడానికి కూడా పనికిరావు పంది.

ఇలా యతి ప్రాసలను తు.చ తప్పకుండా పాటిస్తూ తిట్టేవాడు.నిజానికి అలా వెరైటీ తిట్లు తినడం కోసమే కోంత మంది గొడవ చేసేవాల్లు.

ఇది మా సార్ గురించిన ఉపోద్ఘాతం.మా సార్ ప్రియ శిష్యుడు ఒకడున్నాడు.వాడి పేరు రవిశంకర్.బండ నా వెధవ.ఒక్క రోజు కూడా హోంవర్క్ సరిగా చేసేవాడు కాదు.వాడిని కొట్టీ కొట్టి సార్ కే విసుగు వచ్చి ఒక సారి వాడికి ఒక ఆఫర్ ఇచ్చాడు.

మా ఊరిలొ ప్రతి ఆదివారం పశువుల సంత జరుగుతుంది,అక్కడ పశువులకు కావలసిన అన్ని సామాన్లు అమ్ముతారు.కర్రలు,పలుపు తాళ్ళు వగైరా.మా వాడికి సార్ ఇచ్చిన ఆఫర్ ఏమిటంటే ఒక మంచి కర్ర వాడి డబ్బులతో కొనుక్కువస్తే వాడికి దెబ్బల నుండి విముక్తి.

వాడు ఈ ఆఫర్ ని చాలా సద్వినియోగ పరుచుకున్నాడు.వాడి దెబ్బలు తప్పించుకోవడం కోసం మమ్మల్ని బలి పశువులని చేసే వాడు.

వారినికి ఒకసారి మా సారు వారు కర్ర విరగ్గొట్టడం,వీడు కొత్త కర్ర కొనుక్కురావడం ఇది చర్య.

కొంతకాలానికి వీడు బాగా ముదిరిపోయాడు,సారు వారికి కూడ వీడిని కొట్టక చేతులు బాగా దురద పెడుతున్న కాలమది.

ఒక రోజు ఆకస్మికంగా మబ్బు లేని వానలా,జబ్బు లేని చావులా నోట్స్ చెకింగ్ మొదలు పెట్టాడు.ఇంకంప్లీట్ గా ఉన్నవాల్లందరిని నిలబెట్టడు.ఆ మంద లో మా సారు వారి ప్రియ శిష్యుడు కూడా ఉన్నాడు.కాని అదే రోజు మా వాడు ఒక కొత్త కర్ర కొని తేవడంతో సార్ కి వాడిని కొట్టే అవకాశం లేదు,అందుకని ఒక డెడ్ కైన్ పెట్టి ఆ లోపు వీడు ఎలాగో వర్క్ కంప్లీట్ చేయడు కాబట్టి తన ప్రతాపాన్ని ఆరోజు చూపిదామనుకున్నాడు.

ఆ ఆలోచనతోనే "ఒరేయ్ రవిశంకర్ నువ్వు కనుక నాకు మండే రోజు హోం వర్క్ కంప్లీట్ చేసి చూపించలేదనుకో వీపు విమానం మోత మోగిస్తాను ఏమనుకున్నావో"

దానికి మా వాడు తాపీగా మీకు ఏ రోజు మండుతుందో నాకు ఎలా తెసుస్తుంది సార్ అన్నాడు.

అంతే సార్ కి మండే రోజు రానే వచ్చింది.మా వాడి పంట పండే రోజయింది

15, ఏప్రిల్ 2010, గురువారం

"మారో"చరిత్ర

గతంలో విడుదల అయి,ఘన విజయాన్ని సాధంచిన చిత్రాలని నేటి దర్శకులు తమని తాము గొప్ప క్రియేటివ్ దర్శకులుగా ఊహించుకుని మళ్ళీ రీమేకడం పరిపాటి అయిపోయింది.గతంలో రాంగోపాల్ వర్మ ఇలాగే షోలే చిత్రాన్ని మళ్ళీ తీసి చేతులు కాల్చుకున్నాడు.రాఘవేంద్ర రావు తన పాండురంగ "మహత్మ్యం" ని మన మీద ప్రయోగించిడం వలన కలిగిన అస్వస్థత నుండి పూర్తి గా కోలుకోక ముందే ఒక కొత్త దర్శకుడు మన మీద మరో చరుత్ర రూపంలో మరొ దండయాత్ర చేసాడు.

అలనాటి అమర చిత్ర రాజము మరో చరిత్ర.కమల్ హాసన్,సరిత ఆ పాత్రలలో ఒదిగిపోయారు.బాలచంద్రుడు ఒక రసరమ్య ప్రణయ కావ్యాన్ని తీసాడు.ఆ చిత్రం మళ్ళీ నూతన నటీనత వర్గం తో మళ్ళీ మన కళ్ళముందుకు వస్తుందంటేఎవరికైనా కుతూహలం ఉంటుది.నా బోటి కమల్ అభిమానులకైతే మరీను.

ఈ చితం మీద నా అభిప్రాయాన్ని చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్పలి.నేను కమల్ అభిమానిని ఐనా కూడా నేను వరుణ్ సందేష్ నటనని కమల్ నటన తో పోల్చలేదు.పాత చిత్రాన్ని దీనితో ఏ విధంగా కంపేర్ చేయలేదు.

అయినా కూడా ఈ సినిమా నా ద్రుష్టి లో పరమ చెత్త సినిమాల విభాగంలో చేరింది.

ముందు కాస్టింగ్ విషయంలో జాగ్రత్త పడాల్సింది.వరుణ్ ఆ పాత్రకి న్యాయం చేయలేక పోయాడు.ఇక కథానాయిక విషయానికి వస్తే మనసు చంపుకుని ఎలగైనా సరే తనని అతిలోక సుందరి అనుకుందామనుకున్నా మెదడు మొరాయించింది.హీరోయిన్లు అందరూ శ్రీదేవి అంత అందంగా ఉండకపోవచ్చు,కనీసం పాత్ర కి న్యాయం చేసే వారై ఉండాలి.అలనాటి సరిత కూడా అతిలొక సుందరి ఏమీ కాదు,కాని పాత్ర పరంగా చక్కగా సరిపోయింది.


కథ విషయనికి వస్తే ఆత్మ పాత చిత్రం నుండే తీసుకున్నారు,కాని రక్త మాంసాలు మార్చారు.


ఇక హీరో,హీరోయిన్ల నటన విసుగు పుట్టించేలా ఉంది.గుడిలో పాటకు ఇద్దరి మొహాల్లో కనిపించిన భావాలు చూస్తే దొందూ దొందే అనిపించింది.
హీరో డిక్షన్ ఏ మాత్రం బాగోలేదు.తను ఆ డిక్షన్ మార్చుకోక పోతే ఎంతోకాలం ఇండస్ట్రీ లో ఉండలేడు.

సంగీతం కూడా సోసో గా ఉంది.
మిక్కీ జె మేయర్ బాణీలన్నీ ఒకే రకంగా ఉంటున్నాయి.

చెత్త స్క్రీన్ ప్లే,చెత్త నటన,అంతా కలిసి ఏ సినిమాలో చూడ దగ్గది ఏమి లేదు.దిల్ రాజు ఇక నుండైన దిల్ తో ఆలొచిస్తాడేమో చూడాలి.
ఈ చిత్రం గురించి ఈ టపా కూడా దండగే.