17, ఏప్రిల్ 2010, శనివారం

చిత్రలహరి చిక్కులు తెచ్చిపెట్టిన విధంబెట్టిదనిన......

శ్రీ మద్రమారమణ గోవిందో హా...

భళి భళి భళి భళి అదిగో వచ్చెను క్రిష్ణయ్య,ఆ ఉగ్ర ర్రూపమే చుడవయా...

కుడి చేతిని పైకెత్తి........ఆహో
ఎడమ చేతితో తొడ కొట్టి.....ఆహో

కదనరంగమున కట్టె పట్టుకుని కాలు దువ్వెనే....

శ్రీ మద్రమారమణ గోవిందో హా...

అంతట నారద మునీంద్రుల వారు వచ్చి ప్రలయకాళ రుద్రుని వలె కనిపిస్తున్న క్రిష్ణుల వారితో,

ఎందుకయ్యా క్రిష్ణయ్యా,ఏమి ఆ మహోగ్ర రూపం,ఈ పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తావేమిటయ్యా? అని అనెను.

దానికి క్రిష్ణుల వారు వీరు పిచ్చుకలు కాదు నారదా,కీచకులు,వీరు చేసిన నేరము నీవెరుగవనెను.

దానికి నారదుల వారు వారు చేసిన నేరమేమని అడుగగా,క్రిష్ణుల వారు ఈ విధంగా సెలవిచ్చెను.

నారదా నీవెరుగుదువు కదా,ఈ చుట్టుపక్కల నాలుగు వీధుల వరకు మా ఇంటి లో తప్ప మరెక్కడ ద్రుశ్య శ్రవణ పరికరము(టి.వి) లేదు.కావున చుట్టుపక్కల పుర ప్రజలంతా మా గ్రుహమున కార్యక్రమములు వీక్షంచుటకు అలవాటు పడిరి.


దూరదర్శనమున పాడి పంటలుపశువుల పెంపకం కార్యక్రమము చూసిన తరువాత అమ్మలక్కల్లంతా పిల్ల జెల్లకు కూసింత కూడు వండి పెడదామని బయలుదేరారు.


తరువాత వార్తావాహిని కావడంతో ఎవరూ రాలేదు చూడడానికి,ఆ సమయమున మా కుటుంబ సన్నిహితురాలు చాల దూరము నుండి మమ్ముల చూడడానికై తన ద్విచక్ర వాహనము మీద ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వచ్చినది.


పేరుకు పరమాత్మనైనా,పాక ముందు పార్కింగ్ కి ప్లేస్ లేని ఇంట్లో ఉంటున్నాను.అందుకోసం తను మా ఇంటి వెనక ఉన్న రహదారి మీద వాహనము నిలిపి వచ్చినది.

కుశలప్రశ్నలు,పలకరింపులూ అయి మేము ఏదో విషయం గురించి మాట్లాడుతుండగా ఈ వెధవ వచ్చి "క్రిష్ణుల వారూ 7:30 అయింది "చిత్రలహరి" వచ్చు వేళ అయినదని చెప్పెను.




చాలా కాలము తరువాత కలిసిన మా బంధువుతో మాట్లాడుతూ ఉండడం మూలాన నేను వాడిని ఒక పది నిముషముల తరువాత రమ్మని చెప్పినాను.

వాడు సరిగ్గా లెక్క చూసుకుని పది నిముషాల తరువాత వచ్చి మళ్ళి చిత్రలహరి గురించి అడిగెను.

నేను ఈసారి ఒకింత కటువుగా అయిదు నిముషముల తరువాత రమ్మని చెప్పినాను.


వాడు మళ్ళీ మూడు నిముషాలు కాకముందే గోడకు కొట్టిన బంతిలా వచ్చాడు,ఈసారి నేను కాస్త ఘాటుగా పెట్టడం కుదరదని చెప్పాను.వాడు మళ్ళీ తిరిగి రాలేదు.



మా బంధువుతో కబుర్లు అయిపోయాక వారిని సాగనంపడానికి వెళ్ళి చూద్దును కదా వారి ద్విచక్ర వాహనము కాస్తా రూపురేఖలు మారిపోయి,మన దేవేంద్రుని పుష్పకవిమానముని తలపించినది.


దాని ఆకారము వికారముగా ఐనది,వెనుక టైరు వంకర తిరిగిపోయినది,హ్యండిల్ హ్యమర్ పెట్టి కొట్టినట్టు వంద వంకర్లు తిరిగినది,హెడ్ లైట్ మీట నొక్కకుండానే వెలుగులు విరజిమ్ముతున్నది,పెడలు వెయ్యి గజముల ఎడముగా పడి ఉన్నది,సీటు సవా లక్ష చిరుగులు పడినది.



మొత్తముగా వాహనము,తెలుగు సినీ నాయకుడు బాలక్రిష్ణ తన బల ప్రదర్శనతో శత్రు సమూహమును మట్టుపెట్టిన పిమ్మట,వీక్షకుల మదిలో ఆలోచనల మళ్ళే అంతూ,పొంతూ లేకుండ ఉన్నది.


ఇపుడు చెప్పు నారదా?కేవలము చిత్రలహరి కోసము,చిత్తు కింద బండిని బద్దలు కొట్టిన వీడి బుర్ర క్రిష్ణ కీర్తన పాడించవలసిన ఆవశ్యకత ఉన్నదా లేదా?


దానికి నారదుడు మధ్యే మార్గముగా తప్పు వీడిది కాదు,కార్యక్రమముదని యోచించి దూరదర్శనమునకు పోటీగా మరికొన్ని ఛానల్స్ ని ప్రవేశ పెట్టి దానిని నిర్వీర్య పరిచినాడు.


శ్రీ మద్రమారమణ గోవిందో హా...

3 కామెంట్‌లు: